కరోనా నిబంధనలను కఠినతరం చేసిన రైల్వేశాఖ.. తోక జాడిస్తే భారీ జరిమానా!

  • మాస్కు పెట్టుకోకపోయినా, ఉమ్మివేసినా రూ. 500 జరిమానా
  • నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పిన రైల్వేశాఖ
  • 6 నెలల పాటు నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడి
ఇకపై కరోనా నిబంధనలను పాటించని వారిపై రైల్వేశాఖ భారీ జరిమానాలు విధించనుంది. రైల్వేకు చెందిన ప్రాంతాల్లోకానీ, రైళ్లలో కానీ మాస్కు పెట్టుకోని వారికి రూ. 500 జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. రైల్వే చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఈరోజు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ నిబంధనలను అనుసరించి రైల్వే శాఖ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే రైల్వే ప్రాంగణంలోకి అడుగు పెట్టాలని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాదు, రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేసే వారికి కూడా రూ. 500 జరిమానా విధించనున్నారు. రైల్వే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమ ఉత్తర్వుల్లో రైల్వే పేర్కొంది. అపరిశుభ్రత వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని, ప్రజారోగ్యం దెబ్బ తింటుందని తెలిపింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని... 6 నెలల వరకు కొనసాగుతాయని చెప్పింది.

Railways
Mask
Spit
Fine

More Telugu News